ఆంగ్లేయులు మనకు రాజకీయ స్వాతంత్య్రం ప్రసాదించిన సమయంలో భారతీయుల ఆయుర్దాయం సగటున ముప్పైరెండు సంవత్సరాలు, అయితే ఆధునిక ఔషధాల పుణ్యమా అని ఆ సగటు ఆయుర్దాయం ఇప్పుడు డెబ్భైరెండు సంవత్సరాలకు చేరింది. ఇది సగటు అని గుర్తుంచుకోవాలి; కొందరు డెబ్భై రెండు కంటే ఎక్కువ, ఇంకొందరు డెబ్భై రెండు కంటే తక్కువ బ్రతుకుతారు.
నేడు నా వయస్సున్నవారు మరో నలభైరెండు సంవత్సరాల్లో ఈ సగటు ఆయుర్దాయాన్ని చేరతారు. మనలో కొందరు దీన్ని మించి బ్రతుకుతారు. ఒకవేళ వాళ్ళు డెబ్భైకి చేరగానే ఇహపై కోలుకోలేని వ్యాధితో మంచంపడితే?
మనం నేడు రేయింబవళ్ళు కష్టపడి కక్కుర్తిపడి సంపాదించే డబ్బు అప్పుడు అక్కరకు వస్తుందని అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు.
సరిగ్గా ఇదే దృశ్యం నేడు మనం జీవిస్తున్న ఈ సమయంలోనే అభివృద్ధి చెందిన దేశాలుగా పేరుమోసిన పశ్చిమదేశాలలో జరుగుతుండడం గమనించకపోవడం నిజంగా బాధాకరం. అక్కడ అరవైఐదు సంవత్సరాలు దాటినవారి నిష్పత్తి వారి జనాభాలో 20% పైబడి ఉంది, ఈ నిష్పత్తి వచ్చే యాభై ఏళ్లు పెరుగుతూనే ఉంటుందని అంచనా!
మరి వారందరూ ఆ వయసులో ఎక్కడ ఉంటున్నారు?
వృద్ధాశ్రమాలలో, డబ్బుకు సేవలు అందించే ఆసుపత్రుల్లో.
ఇక్కడ వారికి ఆరోగ్యం బాగున్నంతవరకూ, తమ పనులు తాము చేసుకునేంతవరకూ బాగానే ఉంటోంది. ఎప్పుడైనా మంచాన పడుతున్నారో డబ్బు పోవడం ఎలానూ ఉంటుంది, పైన చీత్కారాలు అదనపు వడ్డీ.
పిల్లలు వారిని చూసుకోరా?
ఆధునికత దృష్ట్యా పిల్లలపై తల్లిదండ్రులు ఆధారపడడం ఒక రకమైన కక్షసాధింపు, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండడం జీవితంలో సఫలం కాకపోవడానికి సూచిక, వయసుమళ్ళిన తల్లిదండ్రులను చూడడం ఖర్చుతోనే కాదు శ్రమతో కూడిన వ్యవహారం.
ఏ ఆధునికతైతే ఆయుర్దాయం పెరిగడంలో ముఖ్యభూమిక పోషించిందో అదే ఆధునికత వారిని ఈ విషాదపరిస్థితుల్లోకి నెట్టేసింది.
వయసులో ఉన్నప్పుడు బ్రతకడానికి ఉవ్విళ్ళూరిన అదే మనుషులు "బ్రతికింది చాలు ఇహ తీసుకుపో" అని తమ మతాలననుసరించి ప్రార్థనలు చేస్తున్నారు. "కాలం (విధి) బలీయమైనది" అంటే ఇదే. నలభై రెండు సంవత్సరాల్లో మనలో కొందరికి ఈ స్థితి వస్తుంది, మనం అప్పుడేం ఏం చేస్తాం? ఏం చెయ్యగలం? ఇప్పుడు అక్కడ ఆసుపత్రుల్లో, వృద్ధాశ్రమాల్లో ఉంటున్నవారు తమ అవసరానికి మించి సంపాదించారు; అదేమైనా రక్షణగా ఉంటున్నదా?
సమాధానం చెప్పలేనిది.
తాము కనినవారే పట్టించుకోకుంటే ఏ సంబంధమూ లేని ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడిన నాయకులు మాత్రం చూస్తారా? అదీ వారివల్ల ఇహ దేశ స్థూల జాతీయోత్పత్తికి ఎటువంటి ప్రయోజనమూ లేదని తెలిసి?!
సరిగ్గా ఇదే మన దగ్గర కూడా జరుగుతోంది.
ఒకప్పుడు అనాథ శరణాలయాలు వెలిశాయి, తర్వాత స్త్రీ సంక్షేమం పేరుతో శరణాయాలు వెలిశాయి, తర్వాత శిశు సంక్షేమం పేరుతో శరణాలయాలూ వెలిశాయి, తర్వాత వృద్ధ సంక్షేమం పేరుతో శరణాలయాలు వెలుస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ డబ్బిచ్చి పొందే సేవలుగా పరివర్తన చెందుతున్నాయి. రతన్ టాటా వంటివారు ఇటువంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఆధునికత మనలో తీసుకొచ్చిన మార్పులకు ప్రతీక!
మన తల్లిదండ్రులను మనం చూడకపోవడం చూసిన మన పిల్లలు మనల్ని భవిష్యత్తులో ఎలా చూస్తారో కదా!
ఇప్పుడు చావుకు భయపడుతున్న మనం అప్పుడు చావుకై అనునిత్యం ప్రార్థిస్తాం.
డెబ్భైఏళ్ళ క్రితం జ్వరం, దగ్గు, మలేరియా వచ్చి పోయేవారు. ఇప్పుడు డైమెన్షయా, కిడ్నీ సమస్యలు, మధుమేహం వంటి నయంచేయలేని రోగాలతో పోతున్నారు. ఆధునిక ఔషధాలు వయసును పెంచగలిగాయి తప్పితే రోగాలతో చావడాన్ని కాదనే నిష్ఠుర సత్యాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా స్వేచ్ఛాచారానికి దూరం జరగడానికి మార్గం సుగమం అవుతుంది, లేదంటే పాశ్చాత్య సమాజం ఉదాహరణ మనకు ఉండనే ఉంది. ఈ జాబితాలోకి నేడు చైనా, జపాన్, కొరియా కూడా ఏనాడో చేరాయి; ఇవన్నీ సంపన్న దేశాలేనన్న విషయం గుర్తుంచుకోవాలి.
అపరిమిత స్వేచ్ఛ, ఒంటరితనం (ఇండివిడ్యువలిజం), హద్దు దాటిన హక్కులతో వారు చెయ్యలేనిది మనం ఏదో చేసేస్తాం అని నమ్మడం మన అవివేకమే అవుతుంది.
నిజ శ్రావణ శుక్ల షష్ఠి, 2080
Comments
Post a Comment