ఇలాంటి చిత్రమాలిక/దృశ్యకావ్యం మరొకటి ఇహపై రావడానికి మరొక ముప్పై సంవత్సరాలు పడుతుంది. ఇందులో నటించిన అందరికీ భవిష్యత్తులో మేలైన పాత్రలు లభిస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు, ఒక్క వైష్ణవీ చైతన్యకి తప్ప! నా దృష్టిలో ఆమొక సాహసం చేశారు. ఈ చిత్రరాజం ద్వారా మనిషి తనకు తానుగా విధించుకోవాల్సిన పరిమితులను, అనునిత్యం తన చుట్టూ పరచుకున్న పరిధులను గుర్తించాలనే నీతిని మరలా తెలియజెయ్యడం జరిగింది.
ఇహ పాత్రల్లోకి వెళితే... "ప్రశ్నలే మిగిలాయి!"
వైష్ణవి తండ్రి మద్యానికి బానిస అవ్వడం వలన ఆమె అతని మాటలు పెడచెవిన పెట్టిందా? లేదా వైష్ణవి తల్లి "ఆడపెత్తనం బోడి పెత్తనం" అనే సామెతకు అతికినట్లు సరిపోయింది కనుక ఇలా జరిగిందా? ఆ తండ్రి దేన్ని కోల్పోయి లేక ఏం సాధించలేక మద్యానికి బానిసగా మారుంటాడు? ఆమె తల్లి పెత్తనం అంతా తన భుజాలపై వేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? అందుకేనా వైష్ణవి అలా ప్రవర్తించింది? ఆమె తండ్రి జీవితంలో సఫలం అయ్యుంటే, ఆమె తల్లి తగుదునమ్మా అని అన్నింట్లో వేలు పెట్టకుండా ఉండుంటే, ఆమెలో వేరే పద్ధతి కనిపించేదా?
ఏమో చెప్పలేం!
"ఈమధ్య ఆడపిల్లలు ఇలానే ఉంటున్నారు!" అనేటప్పుడు కాలాన్ని ఆధారం చేసుకుని ఎందుకు చెబుతున్నాం? ఇంతకు మునుపు ఆడవాళ్ళు ఇలా లేరా? ఇది భ్రమ కాదా?
సమాధానం లేదు. ఆడవాళ్ళు అందరూ ఇలానే ఉన్నారని చెప్పలేం, కానీ ఆడవాళ్ళు అందరూ ఇలానే మారడానికి స్త్రీ సాధికారత వంటి భావజాలాలు తమవంతు కృషి చేస్తూనే ఉన్నాయి. విరాజ్ను తనకు కాకుండా చేసిందని వైష్ణవికి ఏం చెయ్యాలో సలహా ఇచ్చిన సీతనే ఇలాంటి భావజాలాలకు పునాదులుగా మారుతున్నారు. మరి జీవితంలో ఆ భారాన్ని మోసేది సీతనా లేక వైష్ణవినా?
వైష్ణవి ప్రేమ ఆనంద్ మీద కాదు, బహుమతుల మీద. పదవ తరగతిలో పంతులు చేతిలో తిన్న దెబ్బలకు బహుమతిగా ఆనంద్ దొరికాడు, ఆ తర్వాత ఆనంద్ ద్వారా బహుమతులు దొరికాయి. కనుక అతను అన్నిటికంటే పెద్ద బహుమతి, మొదటి బహుమతి. ఎప్పటివరకు? తనను మించిన మరొక బహుమతి విరాజ్ రూపంలో దొరికేవరకూ...
తను చేసేది తప్పని స్వతహాగా వైష్ణవికి తెలుసు, కానీ ఎవరైనా ఆ తప్పును వేలెత్తి చూపిస్తే భరించలేకపోయింది. అందుకే తన చిరాకు, అది అహం కాదు, పేరుపెట్టలేని ఇంకేదో. ఆ "ఇంకేదో" మనందరిలోనూ ముసుగు వేసుకుని దాగుంది. ఆ ఇంకేదోనే తప్పు చేసింది తానేనని ఒప్పుకోవడానికి తటపటాయించేలా చేసింది, మరిన్ని తప్పులు చేయించింది. ఇంతా ఆమెనే చేసి ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యగానే ఆమె ఒక బాధితురాలి స్థాయికి బదిలీ ఐపోయింది.
ప్రేమలనేవి ఆటలు ధనికులకు మాత్రమే, పేదలకు అచ్చిరావు!
ఆనంద్కి తల్లంటే ఎందుకంత అసహ్యం? మూగది మరియు చెవిటిదనా? లేక అందవికారంగా ఉన్నదనా? అసహ్యంగా ఉన్న వైష్ణవిని ప్రేమించినవాడికి తల్లి అందం అడ్డొచ్చిందా? లేక అదంతా వయసు ప్రభావమా? అతని తల్లి అందంగా ఉంటే, ఆమెకి చెవులూ నోరూ పనిచేసుంటే, అతనిలో వేరే పద్దతి కనిపించేదా?
ఏమో చెప్పలేం!
వైష్ణవి తనతో మాట్లాడడానికి చెబుతున్న సాకులను ఎందుకు అర్థం చేసుకోవడంలో ఆనంద్ విఫలం అయ్యాడు? అతనికి మరొక అమ్మాయి దొరకదనా? లేక ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకనా? అంతకాలం దానికోసం చేసినవన్నీ వృథా పోవడం ఇష్టం లేకనా? విరాజ్ తను పెట్టిన ఖర్చును తిరిగి పొందడానికి కనిపించినంతగా ఆనంద్ కనిపించలేదేమో!
తను చేసిన అప్పులు తల్లి తీర్చింది, ఆమె దాచిన డబ్బులు కొడుక్కి ఇచ్చింది, మిగిలిన ఆస్తి కూడా అతనికి ఇచ్చాకనే ఆమె ప్రేమ ఆనంద్కు కనిపించింది. అంటే ప్రేమంటే కేవలం డబ్బన్నట్లేగా, డబ్బుమీదున్నట్లేగా! వైష్ణవికి కూడా ప్రేమ అలాగే అయ్యుండడంలో తప్పేంటి? బహుమతులు ఇచ్చాడు కనుక అతనిపై ప్రేమ, అతనికి మించిన బహుమతులు ఇచ్చాడు కనుక విరాజ్తో తప్పని తెలిసినా కార్యకలాపాల కొనసాగింపు. ఎంతైనా ఆనంద్ మొట్టమొదటి బహుమతి కదా, కనుక అంత తేలికగా వదలలేకపోయింది.
గొప్ప బహుమతులు ఇచ్చేవాడు దొరకగానే అతని ముందు చిట్టి బహుమతులు ఇచ్చేవాడు గుర్తురాలేదు. ఎన్ని చెప్పినా తప్పు వైష్ణవిదేనా? గొప్ప బహుమతులు ఇవ్వలేని వైష్ణవి తండ్రిది తప్పు కాదా? తన స్థోమతకు మించిన బహుమతులు ఇచ్చిన ఆనంద్ది తప్పు కాదా? జీవితాలను బహుమతులుగా చూడడం తప్పు కాదా?
ఏమో చెప్పలేం!
మనకు నచ్చిన అమ్మాయికి మరొక బాయ్ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే ఇంతకుముందు కాలంలో ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఈకాలంలో మాత్రం ఆ అమ్మాయే మనకు కావాలనిపిస్తుంది. ఈ ధోరణికి విరాజ్ పాత్ర ఒక నిలువెత్తు నిదర్శనం.
దీన్ని సాంఘిక చిత్రం అనడంలో ఉన్నటువంటి సహేతుకత నాకు కనిపించడం లేదు. మనవి ఒంటరి జీవితాలు, మనం కోరుకునేది ఒంటరి జీవితాలు, అందుకే కదా మనం ప్రేమించాం అన్నవారి నుండి "స్పేస్" కోరుకుంటున్నాం! ఇక్కడ సంఘం ఎక్కడుంది? ఈ చిత్రం సాంఘిక చిత్రం ఎలా అవుతుంది?
అందుకే ఇది ఆధునిక మానవుని నిత్యచిత్రం, ఒక సత్యచిత్రం, మనం అలవాటుపడిన రోగం ఎంత భయంకరంగా ఉంటుందో అద్దం పెట్టి మరీ అద్దంపట్టిన చిత్రం. వైష్ణవీ చైతన్యకి భవిష్యత్తు లేకుండా చేసిన చిత్రం!
కష్టంలో కూతురికి తండ్రి ఎంత అవసరమో, కొడుక్కి తల్లి కూడా అంతే అవసరం. ఇది పేగుబంధం; ఏ ప్రేమబంధమూ అర్థం చేసుకోలేని కడుపుతీపి. ఆ తండ్రి విఫలుడై మద్యానికి వ్యసనపరుడైనా, తల్లి వికలాంగియై అందవికారంగానున్నా ఇవి వార్వారి మనసుల్లో తమకంటూ తాముగా కట్టుకున్న నియమాలనే పునాదులు, వారికి ఎప్పటికీ పరిధులు, అవే పిల్లలపై పరిమితులను విధించేలా చేస్తాయి. ఎందుకంటే ఆ పరిమితి/పరిధి దాటితే తమ పిల్లలను రక్షించుకునే శక్తి వారికి లేదనే స్పృహ!
ఈ స్పృహ ఆధునిక భారతం కోల్పోతోంది. చెల్లికి పరిమితులు విధించలేని రావణుని చావుకు శూర్పణఖ కారణం అయ్యింది, భార్యకు పరిమితులు విధించలేని దశరథ మహారాజు కొడుక్కు దూరమై శోకంతో కన్నుమూశాడు, కన్న కొడుక్కి పరిమితులు విధించలేని ద్రోణుడు కుత్తుక తెగ నరికించుకున్నాడు, తండ్రికి పరిమితులు విధించలేని భీష్ముడు చంద్రవంశాన్ని రక్షిస్తాననే ప్రతినబూని మరీ దాన్ని కుక్కలపాలు చేశాడు.
సరిగ్గా అవే పరిమితులనే కాలరాస్తున్నాయి హక్కులు, వాటికి వంత పాడుతున్నాయి చట్టాలు. ఇవే వైష్ణవిలో ఆత్మన్యూనత అనేటువంటి భావానికి తెరలు దించాయి, నేటి నాటకానికి ఎర్ర తివాచీ పరచాయి.
ఇంతకీ తప్పెవరిది?
ఏమో చెప్పలేం!
నిజ శ్రావణ శుక్ల ఏకాదశి, 2080
Comments
Post a Comment