మొదటి అంశం :
గత రెండు దశాబ్దాలలో హిందూ వివాహవ్యవస్థలో గుర్తించలేని మార్పులు ఎన్నో వచ్చాయి. గతంలో జీవితం ఆరంభించడానికి వివాహం చేసుకునేవారు, కానీ ఇప్పుడు వివాహం అనేది అన్నీ సాధించాము అనుకున్నాక చిట్టచివరిగా జరిపించే ఒక తంతు ఐపోయింది!
జీవితం ఆరంభించడం అంటే కట్నాలతో కోటలు కట్టడమో లేక కోట్లు సంపాదించే మగాడ్ని మొగుడ్ని చేసుకోవడమో కాదండి, సంఘంలో గృహస్తులుగా మారి కొన్ని బాధ్యతలను నెరవేర్చే కార్యాన్ని స్వీకరించడం. అవి స్వీకరించారు కనుక లైంగికమైన వాంఛలు తీర్చుకునే వెసులుబాటు. ఆ వెసులుబాటు కేవలం ఒక పురుషుడికి మరియు ఒక స్త్రీకి కలిపి ఇవ్వడం జరిగింది, గురువుల ద్వారా. లైంగికచర్యకు పర్యవసానం పిల్లలు, వారి పెంపకం ఇంకొక బాధ్యత. పురుషుడు సంపాదిస్తే స్త్రీ ఇంటిని దిద్దుకురావడం పరిపాటి అయ్యింది.
ఐతే కలియుగాన ఆధునికత మొగ్గతొడిగాక "స్త్రీ సశక్తీకరణ" వంటి గమ్యం తెలియని ఉద్యమాలు భారత స్త్రీలను వంటింటి కుందేళ్లుగా చూపడంలో సఫలీకృతం అయ్యాయి. ఫలితంగా స్త్రీలు ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టారు, పురుషులు తమ కుల ఉపాధిని కోల్పోవడమే కాక ఉద్యోగాలలో స్త్రీలతో పోటీపడాల్సిన పరిస్థితి ఎదురైంది. "సంపాదించే స్త్రీ సబల" అని ఈ అగమ్య ఉద్యమాల జల్పవాదన & అపనమ్మకం.
ఇదే సమయంలో పురుషుడితో పోటీపడే స్త్రీలకు పురుషుడికి ఏమాత్రమూ తీసిపోమని నిరూపించుకోవాల్సిన అనివార్యత ఎదురైంది పరిశ్రమల్లో, అలాంటి అనివార్యతల్లో బలైన మొదటి సంస్కారమే వివాహం, తర్వాత పిల్లల జననం, తదనంతరం వారి పెంపకం. ఇక్కడే ఇంటి పెద్దలు కుక్కకాపలా కాసేవారిగా మారిపోయారు. నాలుగు వేళ్ళూ లోపలికి పోవడానికి & తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆధునికతకు తగ్గట్టుగా మారడం అనివార్యం అయ్యింది.
ఇలా ప్రతి మనిషీ, లింగబేధం లేకుండా, ఆధునిక పరిశ్రమకు అనుగుణంగా తమతమ జీవనపద్ధతులను మార్చుకున్నారు. కానీ జీవనపద్ధతికి అనుగుణంగా పరిశ్రమను రూపొందించింది సనాతన వర్ణాశ్రమవ్యవస్థ. అందుకే అది ఎన్నో శతాబ్దాలుగా మనుగడలో ఉన్నది, కాకలుతీరిన ఆధునిక పరిశ్రమకు నేటికీ సవాలు విసురుతూనే ఉన్నది; కౌటుంబిక వ్యాపారం రూపేణా! ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలు పైబడి నడుస్తున్న పరిశ్రమలు కుటుంబ పరిశ్రమలే తప్పితే వ్యక్తి స్థాపించిన సంస్థలు కాదు.
మరి ఆ కుటుంబానికి మూలం వివాహం, ఆ వివాహమే నేడు హిందూ మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోయింది.
రెండవ అంశం :
కార్చిచ్చుకు (అరణ్యాలలో అగ్నిప్రమాదాలకు) ప్రధాన కారణం మోడువారిన చెట్లు, ఎండిన కలప, రాలిన/ఒడిలిన ఆకులు, చాటుకెళ్లిన తీగలు అంటే ఎవ్వరికీ విశ్వాసం కలగదు. వేదంలో అరణిని (ఎండు పుల్లలు) అగ్నికి తల్లిగా పేర్కొంటారు, రాపిడి (ఘర్షణ) కారణంగా వెలువడే వేడి అగ్నికి మూలమిక్కడ. మన అడవుల్లో ఎండిన చెట్లు గాలివాటానికి గురై ఒకదానితో ఒకటి ఘర్షించుకుని వెలువడిన వేడి ఎండిన/రాలిన ఆకులకు, ఇంకా తీగలకు అంటుకుని దావానలం వ్యాపిస్తుంది.
అన్నిసార్లూ ఇలానే జరగదు. కొన్నిసార్లు వర్షంలో పిడుగులు పడి ఎండిన ఆకులు, తీగలు, చెట్లు అగ్నిని సృష్టిస్తాయి. అలా ఎగసిన అగ్నికి ఉన్నఫళంగా అంతటా వ్యాపించి అడవిని దగ్ధం చెయ్యడమే తక్షణ కర్తవ్యం.
ఆధునికత రావడానికి ముందు అడవితల్లి ఇచ్చే ఈ ఎండు కలప మీదనే ఆధారపడి బ్రతికే జాతుల జీవనశైలి అలాంటి ఉపద్రవాల నుండి మనలాంటి వారికి కొంతమేరకు రక్షణ ఇచ్చేవి; ఈ ఆధునికత వారి జీవితాలను కాటేసింది, వారు వెంటనే నష్టపోయారు. కానీ ఆ ఆధునికతకు త్వరగా అలవాటుపడ్డ మనలాంటి వారం మాత్రం ఆలస్యంగా నష్టపోతున్నాం!
ఇది కూడా ఆర్థిక సిద్ధాంతం మల్లెనే! అనావృష్టిలోనో లేక అతివృష్టిలోనో మొదట నష్టపోయేది పేదవారైతే, ఆలస్యంగా నష్టపోయేది ధనికులు. కళ్ళకు గంతలు కట్టుకుని నిద్ర నటించేవారికి ఒకటి నష్టంగానూ, మరొకటి సుఖంగానూ కనిపిస్తుంది. నష్టమైనా సరే లేదా లాభమైనా సరే, దాని వేగం అది ప్రభావితం చేయనున్న వ్యక్తి యొక్క ఆర్థిక స్థోమత మీద ఆధారపడి ఉంటుంది అనేవాడు మా నాన్న. నా చిన్నప్పుడు నేను మా నాన్నని తింగరోడు అనుకునేవాడ్ని; కాదు, నేనే తింగరోడ్ని అని 2019లో తెలిసింది!
ఒకప్పుడు సనాతన సభ్యతకు ఆలవాలమైన అరణ్య జీవన పద్ధతి ఆధునికత సృష్టించిన విధ్వంసానికి మట్టికరిచింది, ఇప్పుడు ఆటవికమై మన ముందు నిలిచింది. అరణ్యాలు నేడు సెక్యులర్ ప్రభుత్వాల కనుసన్నల్లో ఉన్నాయి, ఇలాంటి సమయంలో అరణ్య జీవనపద్ధతి మళ్ళీ పురుడు పోసుకుంటుందా?
అందుకే దేన్నైనా కోల్పోవడానికి మన పూర్వీకులు ససేమిరా ఒప్పుకోలేదు. పోరాటాలు చేశారు, అసువులు బాసారు, త్యాగాలు చేశారు, విధివంచితులుగా మిగిలారు. అయినాసరే కోల్పోవడానికి ససేమిరా ఒప్పుకోలేదు, అందుకే ఈ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఉంటుంది.
ఎప్పటిదాకా?
కాలానికి అంతం ఎప్పుడు అంటే ఏం చెబుతాం? ఇది కూడా అంతే! అనంతకాలం నుండి క్షీరసాగరమథనం జరుగుతూనే ఉన్నది, నేడు జరుగుతున్నది, ఇకపై ఆగుతుందనే అపోహ మాత్రం ఎందుకు?
శ్రావణ బహుళ తదియ, 2080
అధికమాసం
Comments
Post a Comment