అప్పటిదాకా సీతాదేవి కనిపిస్తుందో లేదోనని మధనపడుతున్న రామునికి ఎప్పుడైతే ఆంజనేయుడు "దృష్ట్వా సీతా" అంటాడో అప్పుడు వెనువెంటనే రావణుడితో సమరానికి సిద్ధమవ్వమని వానరగణానికి సూచనలు చేస్తాడు.
ఎలా?
నీలుడిని లక్షమంది వానరులతో కలిసి మిగిలిన సైన్యానికి దక్షిణసాగరం యొక్క ఉత్తరతీరానికి వెళ్ళడానికి మార్గాన్ని చూపమని. అంటే ఈ దళం వానరసేనకు ముందుభాగంలో ఉంటుంది. అలానే నీలుడికి కొన్ని సూచనలు చేస్తాడు, అవి - ఆ మార్గంలో ఫలమూలాలు సమృద్ధిగా ఉండాలి, అలసి సేద దీరడానికి నీడనిచ్చే చెట్లు ఉండాలి, నీటికి & మధువులకు కొదవ ఉండరాదు. ఏ దేశమైనా సైన్యదళాలు యుద్ధానికి వెళ్ళాలంటే ఆహారం, ధాన్యాలు, నిల్వలు, ఆయుధాలు, ఇతరాలు ముఖ్యమైనవి; మిలిటరీ లాజిస్టిక్స్ అంటారు.
రాముడికి యుద్ధకౌశలం ఎంతగా లేకుంటే చూసిన వెంటనే ఒకరి బలాబలాలను అంచనా వెయ్యడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం, యుద్ధసామాగ్రి గురించి ముందస్తు సూచనలు చెయ్యడం, ఏమరపాటుగా ఉంటే ఎదుర్కొనే విపత్తుల గురించి చెప్పడం సామాన్యంగా కుదిరేది కాదు. రాముడి రణకౌశలం ముందు ఇంకా కనిపిస్తుంది.
ఈ సైన్యానికి మార్గం చూపడం సరే, కానీ హనుమంతుడు చేసిన హంగామాకి రావణుడు ఏదో ఒక ఎత్తు వేసే ఉండాలి. అలాంటప్పుడు సైన్యాన్ని భీతిల్లేలా లేదా చెల్లాచెదురు చెయ్యడానికి ప్రయత్నాలు జరగొచ్చు. సైన్యం అకస్మాత్తుగా దాడికి గురవ్వడాన్ని నేటి పరిభాషలో యాంబుష్ అంటారు.
దీనికి ప్రతిక్రియగా (ముందస్తుగానే...)
ఈ సైన్యానికి రక్షణగా కుడిప్రక్కన (సైన్యం చరించే దిశ దీనికి సూచిక) వృషభుడు తన మందీ మార్భలంతో ఉండాలి, అలానే ఎడమప్రక్కన దుర్జయుడు మరియు గంధమాదనుడు తమ తమ బలాలతో ఉండాలి.
గజుడు, గవయుడు మరియు గవాక్షుడు వంటివారు శత్రువు ఎదురైనాసరే ఆబోతులవలె వారైపైకి దూసుకుపోవాలి, సైన్యం గమనవేగం తగ్గకుండా చూసుకోవాలి.
సేనకు వెనుక ప్రక్కన రక్షణ కోసం జాంబవంతుడు, సుషేణుడు మరియు వేగదర్శి వంటివారు తమ బలాలతో ఉండాలి.
సేనకు ముందున్నవారు సూక్ష్మబుద్ధి & విశ్లేషణా సామర్థ్యం మెండుగా గలవారు, ఎడమవైపున & కుడివైపున గలవారు మహాబలులు మరియు మదగజాల వంటివారు, వెనుకనున్న వారు ముదుసలులు మరియు అనుభవపూర్వకంగా యుద్ధం యొక్క తంత్రాన్ని ఎరిగినవారు. రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు, అంగదుడు, సుగ్రీవుడు సైన్యానికి & ముందున్న వర్గానికి మధ్యనుండి సైన్యంలో సమరోత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉంటారు.
ఈ సైన్యనిర్మాణాన్ని రాముడు అప్పటికప్పుడు సిద్ధం చేశాడు.
ఆయా సందర్భాలను బట్టి సైన్యరక్షణ నిమిత్తం వానరులలో ఇంకొందరు వార్వారి స్థానాలను మారుతూ, కాస్తంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.
"జరగబోయే యుద్ధం భయంకరమైనది, కనుక సాహసముతో పోరాడగల బలపరాక్రములను మాత్రమే మనతో తీస్కెళ్ళాలి. అందువలన బాలురు, వృద్ధులు, మొదలగు బలహీనులను కిష్కింధ వద్దనే వదిలివెళదాం" అంటాడు రాముడు.
"నేను చెప్పింది చేసే దాసులు వానరులు" అని బలహీనులను కూడా తీస్కెళ్ళి మృత్యుకౌగిట్లో దింపడానికి రఘురాముడు విముఖత చూపాడు.
ఆర్.ఎస్.ఎస్ అనుబంధ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్తు నెలక్రితం హర్యానాలో చేసిన బుద్ధిమాలిన పని, అందులో విగతజీవులైన వారి సంఖ్య, అనాథలుగా మారిన కుటుంబాల సంఖ్య అందరికీ విదితమే!
ఒక తెలియని ప్రదేశానికి వెళుతున్నప్పుడే "యుద్ధం మార్గం మధ్యలోనే మొదలవుతుంది" అనే ఉద్దేశ్యంతో రాముడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అలాంటిది ఆ ప్రాంతం ఎలాంటిదో తెలిసి కూడా పిల్లాపాపలు, ముసలీముతక, ఆడంగులతో కలిసి యాత్ర చేయించడంలో అంతరంగం?
ఇప్పటికైనా ఈ సంస్థలను గుడ్డిగా నమ్మడం మానండి, యుద్ధం మార్గం మధ్యలోనే మొదలవుతుంది. అప్పుడు శక్తిహీనులైన వీరందరినీ ఎలా రక్షిస్తారు? శత్రువులతో యుద్ధమే చేస్తారా లేక వీరిని రక్షించుకుంటూ కూర్చుంటారా?
రాముడ్ని ఆరాధించడం, రాముడి పేరున నినాదాలు ఇవ్వడం కాదు, రాముడి రణతంత్రాన్ని ఆచరణలో పెట్టండి.
దీన్నే మున్నూరు నాగరాజు గారు తన "అలోచన మారితే జీవితం మారుతుంది" అనే పుస్తకంలో ఇలా అంటారు - "అనుకోని లేదా ఊహించలేని వాటి గురించి ఆలోచించడం మరియు దానికోసం సిద్ధం అవడం" దూరదృష్టి అని. ఆయన ధనచింతనలో భాగంగా చెప్పారు, దాన్ని యుద్ధచింతనలో కూడా ఉపయోగించవచ్చు.
వృత్తిలో (ఉపాధి కాదు) ఉండే అమోఘమైన లక్షణమే అది, ఒకసారి ఒక అంశంలో ప్రావీణ్యత సాధిస్తే ఆ అంశాన్ని మరే ఇతర రంగంలోనైనా విజయవంతంగా అమలుచెయ్యొచ్చు.
నిజ శ్రావణ శుక్ల త్రయోదశి, 2080
Comments
Post a Comment