అమ్మో ఒకటో తారీఖు (2000) చలనచిత్రంలో ఎల్ బి శ్రీరామ్ గారు పదవ తరగతి పాసైన తన మూడో కూతురితో - "ఇహ నువ్వు చదువుకోవడం ఆపెయ్యమ్మా" అంటాడు. అందుకు ఆయన - "నువ్వు పది చదివి ఆపేస్తే నీకోసం ఒక ఇంటర్ చదివినవాడ్ని తెస్తే సరిపోతుంది, నువ్వు ఇంటర్ చదివితే ఒక డిగ్రీ చదివినవాడ్ని నీకోసం తేవాలి, అదే నువ్వు డిగ్రీ చదివితే అంతకుమించి చదివినవాడ్ని తేవాలి, అందుకు తగినంత కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాలి. ఈ మధ్యతరగతి తండ్రి దగ్గర అంత స్థోమత లేదమ్మా. అందుకే నువ్వు చదువు మానెయ్యి" అంటాడు.
ఆడపిల్ల పెళ్ళిని ఎప్పుడూ ఆమె స్థాయిని మించి చెయ్యాలనే కలలు కంటారు తనల్లిదండ్రులు, ఇప్పుడున్న ఆధునిక ఒంటరి సమాజంలో కూడా ఆడపిల్లలు తమకంటే ఆర్థికంగా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా అధికస్థాయిలో ఉన్న పురుషులను వివాహం చేసుకోవడానికి (అంతెందుకు డేటింగ్, సహజీవనం వంటి ఆధునిక రోగాలకు కూడా!) మొగ్గుచూపుతున్నారు. ఈ మొత్తం ప్రకరణను "టెల్ యువర్ సన్స్ దిస్" అనే ఒక ట్విట్టర్ (ఎక్స్) వినియోగదారుడు - "ఆర్థిక అసమానతలకు ఎవరో కాదు స్త్రీలే ముఖ్యకారణం అంటాడు. ఫెమినిజంను అందుకు సాధన"మని చెబుతాడు.
ఆయన ఇంకా కొనసాగిస్తూ - "జీవితంలో ఎదిగే మగవారు తమ కంటే తక్కువ చదువు, ఉద్యోగం, సంపాదన ఉన్న స్త్రీని పెళ్ళి చేసుకుని వారి ఆర్థికస్థాయిని పెంచుతుంటే స్త్రీలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు; తమకంటే అధికస్థాయిలో ఉన్న మగవారిని పెళ్ళి చేసుకుని ధనాన్ని కొందరి చేతుల్లోనే ఉండడానికి దోహదపడుతున్నారు. స్త్రీలు ఒకప్రక్క ఒకరి కష్టాన్ని అందరికీ పంచాలని (సోషలిజం) ఘోషిస్తూ తమ కష్టార్జితాన్ని మాత్రం మరింత పెంచుకునే (క్యాపిటలిజం) విధంగా ప్రేమ, పెళ్ళి, పిల్లలు అనే అంశాలను ఎంచుకుంటారు. సమాజంలో ఆర్థిక అసమానతలకు ఇదొక కారణం" అంటారు.
దీన్ని ఆయన క్రైస్తవ నాగరికత దృష్టి కోణంలో చెప్పారు, ఇదే వ్యవహారం మన సభ్యతలో ఉన్న మధ్యతరగతి(రికం)లో కూడా గమనించొచ్చు.
నా దృష్టిలో హిందువులు లౌకిక చట్టాలకు లోబడి (లోబడడం బానిసత్వం) విడాకులు తీస్కోవడం పేదరికానికి ఒక కారణం. ఈ చట్టాలలో భార్య భర్తను మోసం చేసినా, మరో నలుగురితో తిరుగుతున్నా, భర్త తల్లిదండ్రులను బాధలకు గురిచేస్తున్నా, పిల్లల్ని పట్టించుకోకపోయినా విడాకులు కావాలంటే భరణం చెల్లించాల్సిందే; ఆమె కట్నం తెచ్చినా తేకపోయినా! ఇలా భరణం ఇచ్చే క్రమంలో మగవాళ్ళు అప్పటిదాకా స్వేదం చిందించి తినీతినక పొదుపు/మదుపు చేసిన ధనంలో సింహ భాగాన్ని నష్టపోతున్నారు.
మీలో ఎవరికైనా బాధ కలిగినా పోపుల పెట్టెలో డబ్బులు దాయడం పొదుపు చెయ్యడం కాదు, మదుపు చెయ్యడం అంతకన్నా కాదు; భరణం రూపేణా వచ్చే డబ్బును వీరు విలాసాలకు ఖర్చు చేస్తారు, ఆధునిక స్త్రీలలో కూడా మహా ఐతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, తప్పితే ఎవరో ఒకర్ని నమ్మి చేతకాని వ్యాపారాల్లో/స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు, వాటిపై ఒక అవగాహన కూడా లేకుండా!
డబ్బును నీటితో పోల్చుతారండి, దానిని ఒడిసి పట్టుకోవడం చేతకాకపోతే డబ్బు కూడా నీరు మాదిరే పల్లానికే చేరుతుంది. ఇలా స్త్రీలు నష్టపోవడమే కాకుండా భరణం ఇచ్చే క్రమంలో పురుషులను కూడా మళ్ళీ పేదరికంలోకి లాగుతున్నారు. ఇది కట్టడానికే వారి జీవితాంతం సరిపోతుంది, ఎంతో కొంత డబ్బు మిగిల్చి పెట్టుబడి పెట్టడానికి ఏమీ ఉండవు, ఉన్నా వాటితో మహా ఐతే మళ్ళీ పూర్వస్థాయికి (విడాకులు ముందు స్థాయికి) రాగలడు. ఇదే మధ్యతరగతి చట్రం, ఇందులో నుండి బయట పడకుండా ఏర్పాటుచేసిన ఉచ్చే హిందూ వివాహ చట్టం!
ఇది గ్రహించడంలో మధ్యమతరగతి హిందువులు విఫలం అవుతున్నారు, అలా కనబడని శత్రువుతో పోరాడడం వలన ఫలితం కూడా కనపడడం లేదు. ఫెమినిజం శత్రువే, కానీ దాని స్వరూపం అదృశ్యంగా ఉంటుంది, దానికి వెన్నుదన్నుగా ఉండేది సాదృశ్యమైన లౌకిక హిందూ వివాహ చట్టం. దీన్ని హిందువులు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చెయ్యాలి.
పైన చెప్పిన మొదటి కారణం ఆర్థిక అసమానతలకు దారితీస్తే, రెండవ కారణం ఆర్థికంగా నష్టపోయేలా చేస్తోంది. రెంటిలోనూ నష్టపోతోంది పురుషులే, స్త్రీలేమన్నా బాగుపడుతున్నారా అంటే అదీలేదు. వారు ఒకర్ని మోసం చేసి మరొకరి చేతిలో మోసపోతున్నారు లేదా డబ్బుపరంగా నష్టపోతున్నారు, & మొగుడ్ని వదిలేసిందనే పేరు దానికి అదనం. సంచితకర్మల ఫలితాలు అప్పటికప్పుడే తిరిగి వస్తాయి!
వీటిని అర్థం చేసుకుని తగిన విధమైన క్షాత్రభూమిని సిద్ధం చేసుకోవాలి, కార్యాచరణ ప్రారంభించాలి. ఒక్కటే మార్గంలో కాదు, అనేక మార్గాలు సృష్టించాలి, ఒక్కటిగా సందర్భాన్ని అనుసరించి కలిసి పోరాటం చెయ్యాలి. శాంతి మార్గం సదా సరైన మార్గమనే మూర్ఖత్వానికి స్వస్తి పలకాలి.
నిజ శ్రావణ బహుళ షష్ఠి, 2080
Comments
Post a Comment